ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు

మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు –  అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ల ఎంపికకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ప్రస్తుతం మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల విధానంలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఈ సవరణను ప్రతిపాదించింది. బిల్లు ఆమోదంతో భవిష్యత్తులో ప్రజలు నేరుగా మేయర్‌, చైర్‌పర్సన్‌లను ఎన్నుకునే విధానానికి చట్టపరమైన మార్గం ఏర్పడింది.

గతంలోనూ ప్రత్యక్ష ఎన్నికల విధానం

మంత్రి నారాయణ వివరించిన ప్రకారం.. 1986 వరకు మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ల ఎంపిక పరోక్ష విధానంలో కొనసాగింది. 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించగా, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం అమల్లో ఉంది. తాజా చట్ట సవరణతో ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రజామోదంతో బలమైన నాయకత్వం

ప్రజలు నేరుగా ఎన్నుకున్న మేయర్‌, చైర్‌పర్సన్‌లకు స్పష్టమైన ప్రజామోదం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల పట్టణ పాలనలో నాయకత్వానికి మరింత స్వతంత్రత లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్‌, చైర్‌పర్సన్‌లు అభివృద్ధి కార్యక్రమాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ప్రజా రవాణా, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి మౌలిక వసతులపై దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయడానికి ఈ విధానం దోహదపడుతుందని వివరించింది.

సమన్వయంతో అభివృద్ధికి ప్రాధాన్యం

వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ప్రత్యక్షంగా ఎన్నికైన మేయర్‌, చైర్‌పర్సన్‌లకు మరింత అవకాశం ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. పట్టణాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు అన్ని వర్గాల ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.మొత్తంగా, పట్టణ స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని ప్రజల నేరుగా తీర్పుతో నిర్ణయించడం, పాలనలో జవాబుదారీతనం పెంచడం, అభివృద్ధి నిర్ణయాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ చట్ట సవరణను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!