–రాజముద్రతో నూతన పట్టాదారు పాస్పుస్తకాలు
–చౌడూరులో రైతులకు పాస్పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
రైతుల భూములకు సంపూర్ణ భద్రత కల్పించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌడూరు గ్రామ సచివాలయం వద్ద రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్పుస్తకాలను బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పిస్తూ భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.నూతన పట్టాదారు పాస్పుస్తకాల్లో 14 భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ వంటి ప్రత్యేక భద్రతా అంశాలను పొందుపరిచినట్లు ఎమ్మెల్యే వివరించారు. వీటి ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడంతో పాటు పాస్పుస్తకాలను ట్యాంపర్ చేయకుండా మరింత భద్రత కల్పించవచ్చన్నారు.2019–24 మధ్య రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగిపోయాయని ఎమ్మెల్యే ఆరోపించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములను 22-ఏ జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి అనేక భూ సమస్యలను పరిష్కరించిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదల భూములకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, పేదల భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించి భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. రీ-సర్వేలో డూప్లికేషన్లో ఉన్న 15.63 లక్షలకుపైగా ఎకరాలను 22-ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు.రైతుల భూములకు సంబంధించిన రికార్డులను మరింత సురక్షితంగా ఉంచేందుకు బ్లాక్చెయిన్ టెక్నాలజీతో కూడిన వ్యవస్థను వినియోగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నూతన పట్టాదారు పాస్పుస్తకాల ద్వారా రైతుల భూములు, ఆస్తులకు భద్రతతో పాటు శాశ్వత హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
“భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యం. రైతుల భూములకు పూర్తి భద్రత, భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ఐ నాగమోహన్ రెడ్డి, రీ-సర్వే డీటీ సుదర్శన్, మండల సర్వేయర్ వెంకటలక్ష్మి, మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామిరెడ్డి మారుతి ప్రసాద్ రెడ్డి, చౌడూరు నాయకులు వీరనారాయణ రెడ్డి, యేరాసి రవికుమార్ రెడ్డి, వెంకటసుబ్బయ్య, గంగాధర్, వెంకట శివారెడ్డి, జీవన్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, పండు, నాగేంద్ర, అన్వర్, శేఖర్, మోహన్ రెడ్డి, రామకృష్ణ రెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


