–ఈ నెల 22న వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురణ
సలాం ప్రొద్దుటూరు –అమరావతి:
ఆంధ్రప్రదేశ్లో పురపాలక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితా తయారీపై అధికారులు దృష్టి సారించారు.రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియను ఎస్ఈసీ పూర్తి చేసింది. ఈ మేరకు రెండు ప్రత్యేక నోటిఫికేషన్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సంతకాలు చేశారు.ఈ నెల 22న వార్డుల వారీ ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఎస్ఈసీ ఆదేశించింది. జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాత మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. దీంతో రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
