–సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రజా కేంద్రంగా నెలరోజుల కార్యక్రమాలు
–కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలను గురువారం మహిళా స్వశక్తి భవన్లో గురువారం ఘనంగా ప్రారంభించారు.కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ ‘సేవా జ్యోతి’ దీపాన్ని వెలిగించి, ‘భారతమాతకు జై’ అంటూ నెలరోజుల స్వచ్ఛతా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు, పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలు, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ‘ప్రజా పరిసరాలు’, ‘స్వచ్ఛ హరిత వేడుకలు’, ‘ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు’, ‘స్వచ్ఛ సమృద్ధి’, ‘సఫాయిమిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరం’ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.కార్యక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిగా అసిస్టెంట్ ఇంజనీర్ దస్తగిరిని నియమించినట్లు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలు, విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మెప్మా ఇన్చార్జి మహాలక్ష్మి, మెప్మా రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.

