–ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి– డా. వి.ఎస్. ముక్తీయార్
సలాం ప్రొద్దుటూరు:
SIR సందర్భంగా ఓటర్లకు అందుతున్న నోటీసులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రొద్దుటూరులో ముస్లిం మత పెద్దలు, ఇమామ్లతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. AP స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తీయార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డా. ముక్తీయార్ మాట్లాడుతూ SIR నోటీసులు అందుకున్న వారు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఓటు హక్కుకు అర్హతను నిర్ధారించుకునేందుకు పాన్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్బుక్, ఆధార్ కార్డు తదితర ఆధార పత్రాలను సమర్పించి, సంబంధిత BLO కేంద్రాల వద్ద తమ ఓటు వివరాలను ధృవీకరించుకోవచ్చని తెలిపారు.
శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ప్రతి మసీదులో ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేసి అవగాహన కల్పించాలని ఇమామ్లను ఆయన కోరారు. సరైన సమాచారాన్ని తెలుసుకుని, అవసరమైన పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ప్రజలకు డా. వి.ఎస్. ముక్తీయార్ పిలుపునిచ్చారు.
