
సలాం ప్రొద్దుటూరు:
ప్రజా సమస్యల పరిష్కారం, పేదలు–సామాన్య ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ ప్రజా చేరికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 41వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య తన కుటుంబ సభ్యులు, ఇతరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి, ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రజల కోసం కాంగ్రెస్.. మీ కోసం కాంగ్రెస్
ఈ సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదలు, కార్మికులు, రైతులు, చేనేత కార్మికులు, మహిళలు, యువత, సామాన్య ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.
ప్రజల సమస్యలను కేవలం ఎన్నికల సమయంలో కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండి తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. ప్రజలు, యువత, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, చేనేత వర్గాలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ బలోపేతానికి ప్రజలే బలం
కాంగ్రెస్ పార్టీని ప్రొద్దుటూరులో మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం పోరాడాలని ఇర్ఫాన్ బాషా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ సందర్భంగా చేనేత వర్గానికి చెందిన పలువురు తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని నాయకుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కుటుంబంలో చేరాలని నాయకులు ఆహ్వానించారు.
కార్యక్రమంలో ప్రొద్దుటూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గొసంగి సుబ్బారెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ మౌలాలి, షేక్ గౌస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
