–ప్రతి అర్హత కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది– టీడీపీ మండల యువనాయకుడు మల్లెల రవీంద్రారెడ్డి
సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):
పేదలు, బడుగు, బలహీన వర్గాల సర్వతోముఖాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీడీపీ మండల యువనాయకుడు మల్లెల రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని దోడియం గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని గడపగడపకు వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామస్థులు పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర స్థానిక సమస్యలను రవీంద్రారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, సూపర్ సిక్స్ పథకాల పరిధిలో అర్హులైన వారికి ‘తల్లికి వందనం’ పథకం లబ్ధి అందకపోతే సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు తాను కట్టుబడి ఉంటానని మల్లెల రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు.
