–రిలయన్స్, జైరాజ్ ఇస్పాత్ కంపెనీలతో యువతకు ఉద్యోగావకాశాలు
–కర్నూలు నగర తెలగ కాపు బలిజ సేవా సంఘం ప్రతిభ పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా
సలాం ప్రొద్దుటూరు ( కర్నూలు):
రెండేళ్లలో కర్నూలు జిల్లా ఎంతో అభివృద్ది చెందిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపులోని కాపు భవన్ వద్ద కర్నూలు నగర తెలగ కాపు బలిజ సేవా సంఘం ప్రతిభ పురస్కారాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఆయన పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. మొదటగా రిలయన్స్ ప్రాజెక్టును రూ.2500 కోట్లు అనుకుంటే.. ఇప్పుడు రూ.6వేల కోట్లు దాటిందన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయన్నారు. దీంతో పాటు మరో రూ.3 వేల కోట్ల ప్రాజెక్టు చేపట్టేందుకు రిలయన్స్ ముందుకొచ్చిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఓర్వకల్లుకు వాటర్ లైన్ తీసుకురాలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ లైన్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇక గత ప్రభుత్వంలో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీని ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. దీని వల్ల కోట్లాది రూపాయలు ఈ కంపెనీ నష్టపోయిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాపై నమ్మకంతో రూ.6వేల కోట్లతో జైరాజ్ ఇస్పాత్ కంపెనీని విస్తరించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దీనిపై నిరంతరం సమీక్షిస్తున్నట్లు చెప్పారు. యువత జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతకు స్కిల్స్ నేర్పించేందుకు ఇంజనీరింగ్ కాలేజీలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఇక అవినీతి మచ్చ లేకుండా తమ కుటుంబం రాజకీయాలు చేస్తోందన్నారు. మంచి చేసే నాయకులెవరో, మాటలు చెప్పే నాయకులెవరో కర్నూలు ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. నగరంలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ, వార్డు ఇంచార్జి శ్రీధర్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, బలిజ సంఘం నాయకులు సోమశేఖర్, స్వామి రెడ్డి, విజయ భాస్కర్, సాంబ శివ, ఆదర్శ అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు .
