
–ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ, ఐపీఎస్ సూచనలు
సలాం ప్రొద్దుటూరు:
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ, ఐపీఎస్ సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో ఉన్న తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఏఎస్పీ విభూ కృష్ణ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న కమిటీలకు చెందిన సుమారు 200 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన, ఉత్సవాల నిర్వహణ, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు.ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు, బాణాసంచా కాల్చడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి ఉత్సవ కమిటీ పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను పాటిస్తూ సోదరభావంతో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ తరఫున అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు కూడా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.సమావేశంలో ప్రొద్దుటూరు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, ప్రొద్దుటూరు II టౌన్ ఇన్స్పెక్టర్ వంశీనాథ్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, వివిధ గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

