ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కడప కేంద్ర గ్రంథాలయానికి మహర్దశ.. 9 నెలల్లో భవనం పూర్తి చేస్తామన్న హామీపై హర్షం

కడప కేంద్ర గ్రంథాలయానికి మహర్దశ.. 9 నెలల్లో భవనం పూర్తి చేస్తామన్న హామీపై హర్షం

📰 Generate e-Paper Clip

 

–ఎమ్మెల్యే మాధవి రెడ్డి చొరవకు, మంత్రి నారా లోకేష్‌కు గ్రంథాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు

 

సలాం ప్రొద్దుటూరు –   కడప:

దాదాపు దశాబ్ద కాలంగా నిర్మాణం పూర్తికాక ఎదురుచూస్తున్న కడప జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనానికి ఎట్టకేలకు పరిష్కార మార్గం సుగమం కావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. భవన నిర్మాణాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనసభలో హామీ ఇవ్వడం పట్ల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.కడప జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణం ప్రారంభమై సుమారు పదేళ్లు గడిచినా వివిధ కారణాలతో పనులు పూర్తికాకపోవడంతో పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం తెలిపింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమైన అంశంగా పేర్కొంది.

శాసనసభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను కడప ఎమ్మెల్యే  మాధవి రెడ్డి శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం పట్ల సంఘం అభినందనలు తెలిపింది. జిల్లా ప్రజలు, విద్యార్థులు, పాఠకుల అవసరాలను గుర్తించి గ్రంథాలయ భవన సమస్యను సభా వేదికపై ప్రస్తావించడం ద్వారా పరిష్కారం దిశగా కీలకమైన చొరవ చూపారని పేర్కొంది.

మంత్రి నారా లోకేష్ హామీపై కృతజ్ఞతలు

ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రస్తావనకు స్పందించిన మంత్రి నారా లోకేష్, కడప జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని సభాముఖంగా హామీ ఇవ్వడం పట్ల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమని, ఇకపై నిర్మాణ పనులు వేగవంతం చేసి హామీ ఇచ్చిన గడువులోగా భవనాన్ని పూర్తి చేయాలని వారు ఆకాంక్షించారు.

వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం

ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన గ్రంథాలయ భవనం అందుబాటులోకి వస్తే కడప నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, పరిశోధకులు, పాఠకులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సంఘం పేర్కొంది. గ్రంథాలయం కేవలం పుస్తకాలు చదివే ప్రదేశంగా కాకుండా యువత విద్యా, విజ్ఞానాభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

హామీ కార్యరూపం దాల్చాలని ఆకాంక్ష

దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కడప జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన సమస్యకు ప్రభుత్వం ఇచ్చిన హామీతో కొత్త ఆశలు చిగురించాయని సంఘం తెలిపింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి, తొమ్మిది నెలల్లో నూతన భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోరింది.ఈ సందర్భంగా సమస్యను శాసనసభలో ప్రస్తావించి పరిష్కారానికి చొరవ చూపిన కడప ఎమ్మెల్యే  మాధవి రెడ్డికి, సమస్యపై సానుకూలంగా స్పందించి తొమ్మిది నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు నాదెండ్ల బాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నవాబ్ జాన్, జిల్లా కోశాధికారి యస్. సుబ్రహ్మణ్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.“ఈ హామీ కార్యరూపం దాల్చి కడప జిల్లా కేంద్ర గ్రంథాలయం త్వరలోనే ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులు, పాఠకులకు అందుబాటులోకి రావాలి. ఇది కడప జిల్లా విద్యా–విజ్ఞాన ప్రగతికి ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవాలి” అని సంఘం ఆకాంక్షించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!