–సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కడపలో ప్రథమ రాష్ట్ర మహాసభలు
— పోస్టర్లు ఆవిష్కరించిన నారాయణ విద్యాసంస్థల డీజీఎం రామ్మోహన్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు –కడప:
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పిఆర్ఎస్ వైఎఫ్ నాయకత్వాన్ని నారాయణ విద్యాసంస్థల డీజీఎం రామ్మోహన్ రెడ్డి అభినందించారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కడప నగరంలో నిర్వహించనున్న పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభల పోస్టర్లను శనివారం కడపలోని నారాయణ కళాశాలలో ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పిఆర్ఎస్ వైఎఫ్ చేస్తున్న పోరాటాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని విద్యా, యువజన రంగ సమస్యల పరిష్కారానికి మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు. సామాజిక ఉద్యమాలను మరింత విస్తృతం చేసి విద్యార్థులు, నిరుద్యోగ యువత మన్ననలు పొందాలని సూచించారు. రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వం హామీలను అమలు చేయాలి
పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కడప నగరంలో ప్రథమ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభల్లో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.విద్యారంగం, నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1,500 అందిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.వలసలకు నిలయంగా మారిన రాయలసీమలో పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న లెక్చరర్, ఉపాధ్యాయ, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్స్ చార్జీలను పెంచాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని కన్నెలూరు శంకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు, నగర నాయకులు లోకేష్, సుధీర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
