–దేశ ప్రజల హక్కులు, సంపద పరిరక్షణకు యువత ముందుకు రావాలి: రహమతుల్లా
సలాం ప్రొద్దుటూరు – వేంపల్లి:
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వేంపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో-కన్వీనర్ దాదా పీర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంపద, ప్రజల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాజకీయాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత చురుకుగా రాజకీయ రంగంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.స్వాతంత్ర్య సమరయోధులు కలలు కన్న సమానత్వం, ప్రజాస్వామ్యం, ప్రజా సంక్షేమం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మార్పు తీసుకురాలేని నాయకులను పదేపదే ఎన్నుకోవడం కాకుండా సమర్థవంతమైన పాలన అందించే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ప్రజలను, ముఖ్యంగా యువతను కోరారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి సభ్యుడు పుల్లయ్య, ఆప్ మండల నాయకులు పీరుబాషా, మహమ్మద్ గౌస్, అల్లాబక్షు, సిరాజ్, గణేష్, అల్లి తదితరులు పాల్గొన్నారు.
