–ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లేకుండా పోయింది వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గత 26 నెలలుగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అనుభవించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం దొరసానిపల్లిలోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో దోపిడీ, జైళ్లు, అప్పులు తప్ప ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుందని ప్రశ్నించారు. “ఈ రాష్ట్ర పాలకుల కంటే బ్రిటిష్ వారే నయం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమం మాటల్లోనే..
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి గురించి వేదికలపై మాట్లాడుతోందని, అయితే క్షేత్రస్థాయిలో పేద ప్రజల జీవితాల్లో ఆ సంక్షేమం కనిపించడం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, పెన్షన్లు వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.రాష్ట్రంలో భారీగా అప్పులు పెరిగాయని, 26 నెలల పాలనలో అభివృద్ధి కంటే అప్పుల భారమే ఎక్కువైందని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆందోళన
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాల సమస్యను అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులు, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నలు
వ్యవసాయ రంగంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పంటల మార్కెటింగ్, గిట్టుబాటు ధరల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ హక్కులు, బకాయిల కోసం రోడ్డెక్కి నిరసనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఇతర ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు.
మహిళలకు, ప్రజలకు భద్రత ఎక్కడ?
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. మహిళలపై దాడులు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజల మాన, ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.పేదలకు అత్యవసర సమయంలో అండగా నిలిచే ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
“పాలకులకు స్వేచ్ఛ ఉంది.. ప్రజలకు లేదు”
“ఆంధ్రప్రదేశ్లో పాలకులకు స్వేచ్ఛ ఉంది.. కానీ ప్రజలకు స్వేచ్ఛ లేదు” అని రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పాలకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండాలని, శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కును కూడా గౌరవించాలని అన్నారు.రాష్ట్రంలో నారా లోకేష్ ‘రెడ్బుక్’ ఆధారిత పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ, రెడ్బుక్ను పక్కనపెట్టి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పాలన సాగిస్తే తాను హర్షిస్తానన్నారు.
గాంధీ, భగత్సింగ్ స్ఫూర్తితో ప్రజలు ముందుకు రావాలి
స్వాతంత్ర్యం అంటే కేవలం ఆగస్టు 15న జెండా ఎగురవేయడం కాదని, ప్రతి పౌరుడు స్వేచ్ఛగా మాట్లాడే, ప్రశ్నించే, తన హక్కుల కోసం శాంతియుతంగా పోరాడే పరిస్థితి ఉండటమే నిజమైన స్వాతంత్ర్యమని అన్నారు.మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గం, భగత్సింగ్ పోరాట స్ఫూర్తి, అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ప్రజల హక్కుల కోసం మాట్లాడటం ఆపబోమని స్పష్టం చేశారు.2029 ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును మహాత్మాగాంధీ, భగత్సింగ్ స్ఫూర్తితో వినియోగించి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను కాపాడాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరారు.
