–“డిస్టిలరీల వ్యాపారం గురించి మాట్లాడే వారికి డీఎస్సీ గురించి ఏం తెలుసు?”
–జనసేన నాయకుడు మాదాసు మురళి ఘాటు విమర్శలు
సలాం ప్రొద్దుటూరు:
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ నాయకులు డీఎస్సీ ఉద్యోగ నియామకాల అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి తీవ్రస్థాయిలో విమర్శించారు.
మంగళవారం నందిని క్లాత్ మార్కెట్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాలు పూర్తయి ఏడు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఆ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు.
“కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పాలన అందిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని వివాదాలను సృష్టిస్తున్నాయి. ఎప్పుడో పూర్తయిన ఉద్యోగ నియామకాలపై ఇప్పుడు కొత్తగా రాద్ధాంతం చేయడం రాజకీయ దృష్టి మళ్లింపు తప్ప మరొకటి కాదు” అని మాదాసు మురళి అన్నారు.
నిరుద్యోగ యువతపై వైసీపీ నాయకులకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువతను గందరగోళానికి గురిచేయడం, వారి భవిష్యత్తుతో చెలగాటమాడటం సరికాదన్నారు.
“ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీఎస్సీ అంశం”
వైఎస్సార్సీపీ నాయకులు చిదిరి అప్ప రాజు, జోగి రమేష్ తదితరులు చేసిన తప్పులను ప్రజలు మరిచిపోయేలా ప్రస్తుతం డీఎస్సీ అంశాన్ని ముందుకు తెచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాదాసు మురళి ఆరోపించారు.
“ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు? ఎవరు ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయాలు చేస్తున్నారు? అనే విషయాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు” అని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై నిర్మాణాత్మకంగా మాట్లాడకుండా ప్రతి అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చడం ప్రతిపక్షాల తీరుకు నిదర్శనమన్నారు.
“డిస్టిలరీల వ్యాపారం గురించి మాట్లాడే వైసీపీ నాయకులకు డీఎస్సీ గురించి ఏం తెలుసు? ముందుగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి” అని మాదాసు మురళి ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, రాజకీయ ఆరోపణలతో వాస్తవాలను మరుగునపరచడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
