సలాం ప్రొద్దుటూరు:
స్థానిక ఈద్గా మసీదులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఏపీ స్టేట్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పేద ముస్లిం మహిళలు, ముఖ్యంగా వితంతు మహిళల ఆర్థిక సాధికారతకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. గృహ పరిశ్రమలకు సంబంధించిన వివిధ రంగాల్లో వారికి శిక్షణ అందించి, ప్రభుత్వ పథకాలు లేదా స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలను పరిశీలించారు.
అర్హులైన మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయం అందేలా కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా సమిష్టి కృషి అవసరమని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు.
