జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీన కు ఏఐబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాథోడ్ వినతి
సలాం ప్రొద్దుటూరు – కడప:
చక్రాయపేట మండలం కల్లూరుపల్లి తండా గ్రామ పంచాయతీలో నెలకొన్న తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, స్మశానవాటిక తదితర మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాథోడ్ జిల్లా అధికారులను కోరారు.సోమవారం కడప కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్ రాథోడ్ మాట్లాడుతూ.. కల్లూరుపల్లి తండాలో సుమారు 1,200 మందికి పైగా జనాభా నివసిస్తున్నప్పటికీ దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులు సైతం పూర్తిస్థాయిలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గ్రామంలో అవసరమైన ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేసి శాశ్వతంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. వర్షాకాలంలో గ్రామంలోని రహదారులు అధ్వానంగా మారి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ప్రధాన వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే రాత్రి వేళల్లో వీధి దీపాలు లేక గ్రామం చీకటిలోనే ఉంటోందని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామానికి కేటాయించిన స్మశాన స్థలాన్ని గుర్తించి, ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు చక్రాయపేట మండల తహసీల్దార్, ఎంపీడీఓలకు గ్రామ ప్రజలు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని జగన్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తండాను సందర్శించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కార చర్యలపై ఆదేశాలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో తండా వసూలు బాలాజీ నాయక్, దేవేంద్ర నాయక్, భాను నాయక్, చంటి నాయక్, బన్నీ నాయక్, రామస్వామి నాయక్, చిన్న వెంకటేష్ నాయక్, నరుణ్ నాయక్, ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
