సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):
పట్టణంలోని విశ్వజ్యోతి హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ పాఠశాల క్రికెట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సోమవారం బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.ఈ పోటీల్లో బీసీ బాలుర హాస్టల్ జట్టు విజేతగా నిలవగా, సెయింట్ మేరీస్ హైస్కూల్ జట్టు రన్నరప్గా నిలిచింది. విజేతలకు ట్రోఫీలు, బహుమతులను అందజేసిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఏకాగ్రతను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.సీఐ నరేష్ మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సత్యనారాయణ, పీఈటీలు సంజీవరాయుడు, సురేంద్ర, షాహిన్, రవి, కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
