సలాం ప్రొద్దుటూరు:
జగనన్న కాలనీలు, ఎస్ఎస్ మాల్, డీఏడబ్ల్యూ కళాశాల వ్యవహారాలు సహా ప్రతి అంశాన్ని తన పై వేయడం సరికాదనీ నిజంగా అక్రమాలు జరిగాయని భావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పోలీసు, విజిలెన్స్, సిట్, సీఐడీ లేదా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు.ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురువారం స్థానిక తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని, నిజాయితీ ఉన్నందువల్లే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేశారు. తన పై టిడిపి మాజీ ఇన్ఛార్జ్ జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి చేస్తున్న విమర్శలు వాస్తవం లేదన్నారు. నిజాలు వెలుగులోకి రావడానికి అవసరమైన సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
..వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గం లో ఇళ్లు లేని పేదలందరికీ గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో సుమారు 23 వేల మందికి పూర్తి హక్కులతో ఇంటి పట్టాలు పంపిణీ చేశామని, ఇళ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారునికి రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఆ సమయంలో గృహనిర్మాణ పనుల కోసం నిల్వ చేసిన సుమారు 268 టన్నుల ఇనుప కడ్డీలు, దాదాపు 20 లారీల సరుకు, రూ.1.70 కోట్ల విలువైన సామగ్రి మాయమైనట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి హౌసింగ్ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఏఈ సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారని గుర్తుచేశారు. సుబ్రహ్మణ్యం గత ప్రభుత్వంలో రూరల్ ఏఈగా పనిచేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇన్ఛార్జ్ డీఈ బాధ్యతలు కల్పించారని ఆరోపించారు. ఆయన శాఖ కార్యాలయం కంటే ఎక్కువగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కార్యాలయంలోనే ఉండేవారని, ప్రభుత్వ ఆస్తి మాయం ఘటనలో అనేక అనుమానాలు అధికార పార్టీ వైపు చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. సుబ్రహ్మణ్యం అరెస్టు అనంతరం ఆయన నోరు విప్పకపోవడానికి అధికార పార్టీ అండదండలే కారణమని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కస్టడీలో విచారణ నిర్వహిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయడం కంటే ముందుగా మాయమైన ఇనుప కడ్డీలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో హమాలీలు, మేస్త్రీలు, సంబంధిత సిబ్బంది, ఘటన జరిగిన రోజున అక్కడికి వచ్చిన అధికారులుగానీ, ప్రైవేటు వ్యక్తులుగానీ ఎవరెవరు ఉన్నారో విచారణ చేస్తే అసలు నిందితులను గుర్తించవచ్చని తెలిపారు. పోలీసులు కేసును ఛేదించే సామర్థ్యం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో నిజాలను బహిర్గతం చేస్తారో లేదో అన్న అనుమానం ప్రజల్లో ఉందన్నారు.
ప్రొద్దుటూరులో గృహనిర్మాణ శాఖ ద్వారా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అదే అంశంపై సమగ్ర విచారణ జరపాలని తాను కూడా కోరుతున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు, గుర్తింపు పొందిన 11 మంది కాంట్రాక్టర్లు, గుర్తింపు లేని సుమారు 20 మంది కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులను విచారించాలని డిమాండ్ చేశారు. ప్రతి లబ్ధిదారుడు చెల్లించిన రూ.35 వేల మేర పనులు జరిగాయా, అంతకంటే ఎక్కువ పని జరిగితే బిల్లులు మంజూరయ్యాయా, కాంట్రాక్టర్లకు మొత్తం చెల్లింపులు చేరాయా, అధికారులు ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా అనే అంశాలపై దర్యాప్తు జరగాలని కోరారు. కొందరు కాంట్రాక్టర్లు నిర్మాణ సామగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించిన విషయాలను కూడా తాను చూపించగలనని పేర్కొన్నారు.
