సలాం ప్రొద్దుటూరు (కడప):
సలాం ప్రొద్దుటూరు (కడప):
కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో (సాంఘిక సంక్షేమ గురుకులాలు) సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని సిఐటియు (CITU) జిల్లా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం కడప నగరంలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ను సిఐటియు బృందం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ, కడప జిల్లాలోని వివిధ గురుకుల పాఠశాలల్లో దాదాపు 200 మంది సెక్యూరిటీ గార్డులు రాత్రి పగలు కష్టపడి విద్యార్థులకు, ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరికి ఇచ్చే అల్ప గౌరవ వేతనాన్ని కూడా గత 7 నెలలుగా నిలిపివేయడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు .
7 నెలలుగా జీతాలు సున్నా:
గత ఏడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కార్మికులు నిత్యావసరాలు కొనలేక, ఆకలితో అలమటిస్తున్నారు. జీతాలు రాక, చేతిలో డబ్బులు లేక పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.కుటుంబ పోషణ కోసం ఇప్పటికే విపరీతంగా అప్పులు చేశారని, ప్రస్తుతం మార్కెట్లో వీరికి అప్పు ఇచ్చే నాధుడు కూడా లేరని పేర్కొన్నారు.ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు గురుకుల పాఠశాలల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు.భద్రత కల్పించే కార్మికుల పొట్ట గొట్టడం ఎంతవరకు న్యాయమని సిఐటియు ప్రశ్నించింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించి, తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 మంది సెక్యూరిటీ గార్డుల 7 నెలల బకాయి జీతాలను ఒకే విడతలో విడుదల చేయించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని, లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ ప్రతినిధులు మరియు గురుకుల పాఠశాలల సెక్యూరిటీ గార్డుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
