కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవాలని పోలీసుల సూచన
సలాం ప్రొద్దుటూరు:
పట్టణానికి చెందిన ఓ పోక్సో కేసు నిందితుడిపై కడప ప్రత్యేక పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.
2016లో ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న బోనాల సుదర్శన్ రావుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ వారెంట్ జారీ చేసినట్లు టూ టౌన్ సీఐ వంశీనాథ్ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిందితుడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరై చట్టపరమైన ప్రక్రియకు సహకరించాలని సూచించారు.
ప్రస్తుతం నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయని పోలీసులు వెల్లడించారు. అతని నివాస స్థలం లేదా సంచారంపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
న్యాయస్థానం ఆదేశాల అమలు కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని, ప్రజల సహకారం ఉంటే నిందితుడిని త్వరితగతిన గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, నిందితుడు స్వచ్ఛందంగా లొంగిపోవడం ఉత్తమమని ఆయన సూచించారు.
