– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి
–పోరాడే శక్తులకు సీఐటీయూ అండగా ఉంటుందని స్పష్టం
సలాం ప్రొద్దుటూరు (మైలవరం):
దుగ్గనపల్లి గ్రామ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి సీఐటీయూ పూర్తి మద్దతు ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తెలిపారు. సోమవారం మైలవరం మండలం దుగ్గనపల్లి గ్రామాన్ని సీఐటీయూ నాయకులతో కలిసి సందర్శించిన ఆయన రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదికి రూ.1,153 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న దాల్మియా సిమెంట్ పరిశ్రమ 60 నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయడంలో వెనుకంజ వేయడం విచారకరమన్నారు. పరిశ్రమ వల్ల వ్యవసాయం, పర్యావరణం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతున్నా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తుల సమస్యలను విస్మరించి రెండో ప్లాంట్కు శంకుస్థాపన చేయడం దురదృష్టకరమని విమర్శించారు.గ్రామంలోని 120 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని గ్రామాన్ని తరలిస్తామని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, పరిహారం మొత్తం, భూమికి బదులుగా భూమి, పునరావాస వివరాలపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం, దాల్మియా యాజమాన్యం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి కుటుంబానికి 10 సెంట్ల ఇంటి స్థలం, ఒక్కో వ్యక్తికి రూ.30 లక్షల పరిహారం, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, రైతు కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు. భూములపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను నిరాశ్రయులను చేసే విధంగా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. పోరాడే ప్రజా శక్తులకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ, దుగ్గనపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అత్యంత బాధాకరమని అన్నారు. ఈ నెల 30న కడప కలెక్టరేట్ వద్ద కనీస వేతనాలను రూ.26 వేలకు పెంచాలని కోరుతూ చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా దుగ్గనపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, జమ్మలమడుగు నగర అధ్యక్షుడు దాసు, మున్సిపల్ విభాగం నాయకులు శేఖర్, నాగన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు హరిబాబు, అఖిల్, ఉదయ్, కళ్యాణ్తో పాటు దుగ్గనపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.
