సలాం ప్రొద్దుటూరు:
మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆధ్వర్యంలో “బడికి పోదాం – భవిష్యత్తును నిర్మించుకుందాం!” అనే నినాదంతో విద్యా జాగృతి ఉద్యమాన్ని ప్రొద్దుటూరు మండలంలోని సోములవారి పంచాయతీ పరిధిలోని పెన్నా నగర్ మరియు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రాంతాలలో గురువారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏంపీజే కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని విద్య యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించారు. ప్రతి చిన్నారి విద్యను పొందడం రాజ్యాంగబద్ధ హక్కు అని, పిల్లల భవిష్యత్తు విద్యతోనే ప్రకాశవంతంగా మారుతుందని వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, సీమ ఇంచార్జి అయూబ్ ఖాన్, జిల్లా అధ్యక్షులు జాకీర్ ఉమ్రి మాట్లాడుతూ, ఆర్టికల్ 21- A ప్రకారం
“6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి ఉచిత, నిర్బంధ విద్య అందించడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. “సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారం అని, ప్రతి కుటుంబం తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. “ప్రతి బిడ్డ బడిలోకి – ప్రతి కుటుంబం వెలుగులోకి” అనే లక్ష్యంతో MPJ విద్యా జాగృతి ఉద్యమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో MPJ పట్టణ అధ్యక్షులు హుస్సేన్ భాష,కార్యదర్శి మహ్మద్ రఫీ, నాయకులు ఇస్మాయిల్,షఫీ, ఫర్హాన్,ముక్తాయర్, గౌస్ లాజం, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేశారు.
