–విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఆదేశం
సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా జాప్యం లేకుండా తక్షణం సిద్ధం చేయాలని విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఆదేశించారు. అమరావతి నుంచి గురువారం సాయంత్రం ఆయన అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. జిల్లాల పునర్విభజన అనంతరం కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా గురించి ఆయన జిల్లాల వారీగా ఆరా తీశారు. అనంతపురం జిల్లాకు సంబంధించి తాము సమగ్ర నివేదికలు సిద్ధం చేసినట్లు ఏడీ -1 మునీర్ ఖాన్ తెలపడంతో అడిషనల్ డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర అంశాలపైనా చర్చించి తగిన సలహా, సూచనలు ఇచ్చారు. జిల్లా విద్యా శాఖ కార్యాలయ సూపరింటెండెంట్లు ఆదినారాయణ, జగదీశ్, లక్ష్మీనారాయణ, ఐటీ విభాగం ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ రాం ప్రసాద్, కార్యాలయ ఉద్యోగులు వంశీ, చక్రీ, సూర్య హాజరయ్యారు.
