— ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు మోహన్ యాదవ్
సలాం ప్రొద్దుటూరు (కడప):
నీట్ (నీట్ ) పరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ( ఆర్ ఎస్ యు) ఆధ్వర్యంలో కడప లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు మోహన్ యాదవ్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. వెంటనే సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేయాలని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆర్ ఎస్ యు డిమాండ్ చేసింది.
లేనిపక్షంలో విద్యార్థులు, యువజన సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు కడప నగర అధ్యక్షుడు రాఘవ, నగర కార్యదర్శి జశ్వంత్ కుమార్, లేవాకు, సహాయ కార్యదర్శి వంశి, నాయకులు చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
