— సిరాలదొడ్డి గ్రామంలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ
— హక్కుల కోసం దళిత, గిరిజనులు సింహాలై గర్జించాలి: దళిత సంఘాలు పిలుపు
సలాం ప్రొద్దుటూరు (ఎమ్మిగనూరు):
చదువునే ఆయుధంగా మలుచుకొని 16 డిగ్రీలు సాధించి, వేల పుస్తకాలను అధ్యయనం చేసి ప్రపంచ జ్ఞానానికి దిక్సూచిగా మారి నేటికి భారత ప్రజల హృదయాలలో డా.బి.ఆర్.అంబేద్కర్ గారు అస్తమించని మేధా సూర్యుడుగా వెలుగొందుతున్నారని కెవిపియస్ జిల్లా అధ్యక్షులు సప్పోగు దేవ సహాయం, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసిసి) రాష్ట్ర కార్యదర్శి డా.మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు, డా.బి.ఆర్. అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదెన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జి.ఆనంద్ చైతన్య మాదిగ లు పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం,సిరాల దొడ్డి గ్రామంలో దళితులు ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ దళితులు దళిత సంఘాల నేతలను గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి ఘన స్వాగతం పలికారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దళిత,బహుజనుల ఐక్యతను చాటారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గజమాలలతో పూలమాలంకరణ చేసి ఘన నివాళులు అర్పించారు.ఆనంతరం దళిత రచయితల సంఘం (దరసం) వ్యవస్థాపక అధ్యక్షులు “ఆ రేకంటి భాస్కర్” అధ్యక్షతన గ్రామ దళితులు ఏర్పాటు చేసిన సభలో పలువురు దళిత నేతలు ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి, భారతదేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతృత్వాలకు పునాదులు వేయడమే కాకుండా ప్రాథమిక హక్కుల ద్వారా జీవించే హక్కు కల్పించిన గొప్ప మానవతా వాది అంబేద్కర్ అని కొనియాడారు. మేకలుగా ఉన్నంత కాలం బలిస్తూనే… ఉంటారని డా.బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తితో హక్కుల సాధన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం సింహాలై గర్జించాలని కోరారు. నేడు పాలకులు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా క్రైస్తవ మతం మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, ఎస్సీ హోదా రద్దు అని తీర్పును ఇప్పించడం వెనుక మతవాదుల, మనువాదుల కుట్ర దాగి ఉందని ఆవేదన చెందారు. దళితులు మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష పోలేదని, ఆకలి, అవమానాలు, అసమానతలతో, అంతరాలతో… నలిగిపోతున్నారని మండి పడ్డారు. దళితుల మత స్వేచ్ఛను హరిస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సభలో ప్రముఖ కళాకారులు కత్తి రంగన్న, గోనెగండ్ల కరుణాకర్ ల ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బేడ,బుడగ జంగం సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాక్షల దస్తగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజహాళ్ళి మహదేవ్ మాదిగ, ఉపాధ్యాయులు కనకవీడు భాస్కర్, అంపయ్య, యం.ఏ.ఓ. బనవాసి వినోద్, కెవిపిఎస్ నాయకులు సప్పోగు తిమ్మన్న, సుమాల అంతోని, కలుగొట్ల రాజా రమేష్, సుమాల రాజు, కోటేకల్ చిన్నప్ప, సీనియర్ దళిత నాయకులు గుడికల్ స్వామిదాస్, అల్వాల నాగరాజు, ముగతి నరసన్న, సిరాల దొడ్డి గ్రామ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటి సభ్యులు లక్ష్మన్న, గోపాల్,మారెన్న రాముడు,రాజశేఖర్, యోహాను తదితరులు పాల్గొన్నారు
