–టీఎన్ఎస్ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్కు టీడీపీ నేతలు
సలాం ప్రొద్దుటూరు:
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో టీఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా యూజీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.మొత్తం 16 జట్లు ఈ టోర్నమెంట్లో హోరాహోరీగా తలపడగా, ఫైనల్కు యోగివేమన ఇంజినీరింగ్ కళాశాల, ఎస్ఆర్ఐటీ జట్లు అర్హత సాధించాయి. దీంతో టైటిల్ కోసం బుధవారం జరగనున్న ఫైనల్ మ్యాచ్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఫైనల్కు టీడీపీ నేతల హాజరు..
ఫైనల్ మ్యాచ్కు జిల్లా నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి తదితరులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించనున్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు పేర్కొన్నారు.
విజేతకు రూ.30 వేలు
టోర్నమెంట్లో విజేతగా నిలిచే జట్టుకు రూ.30,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.20,000 నగదు బహుమతి అందజేయనున్నారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ టోర్నమెంట్ను టీఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. చేతన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.టైటిల్ కోసం యోగివేమన–ఎస్ఆర్ఐటీ తుది సమరం.. ట్రోఫీ ఎవరి సొంతమవుతుందోనన్న ఉత్కంఠతో ఫైనల్ మ్యాచ్పై అందరి దృష్టి నెలకొంది.
