ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రాజగోపాల్‌ జోలికొస్తే ఊరుకునేది లేదు..

రాజగోపాల్‌ జోలికొస్తే ఊరుకునేది లేదు..

📰 Generate e-Paper Clip

 

 

–రాచమల్లు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

 

–“బీసీలను కించపరిచి మాట్లాడొద్దు.. పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగానే సమాధానం ఇస్తా”

 

సలాం ప్రొద్దుటూరు :

 

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ నేత చల్లా రాజగోపాల్‌ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే సహించేది లేదని, ఆయన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

“రాజగోపాల్‌ నా స్నేహితుడు.. ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేదు. రాజకీయంగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి.. నేను కూడా పద్ధతిగానే సమాధానం ఇస్తా. కానీ బీసీలను కించపరిచేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు” అని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘాటుగా పేర్కొన్నారు.చల్లా రాజగోపాల్‌ యాదవ్‌పైనే కాకుండా ఏ టీడీపీ నాయకుడు, కార్యకర్తపై అయినా అనుచితంగా వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.“చల్లా రాజగోపాల్‌ మీదే కాదు.. ఏ టీడీపీ కార్యకర్తపై అయినా చేయి వేసి చూడు.. నీకు తెలుస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడటం మా బాధ్యత” అని వరదరాజులరెడ్డి హెచ్చరించారు.రాజకీయంగా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే వ్యక్తిగత దూషణలు, కులపరమైన వ్యాఖ్యలు, అవమానకరమైన మాటలకు దిగితే అదే స్థాయిలో రాజకీయ సమాధానం ఇవ్వాల్సి వస్తుందని అన్నారు.

 

“బీసీలంటే అంత చులకనా?”

 

బీసీ వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడే ధోరణిని ఎంతమాత్రం సహించబోమని ఎమ్మెల్యే అన్నారు.“బీసీలను కించపరిచి మాట్లాడతావా? బీసీలు నీకు బుద్ధి చెబుతారు. అహంకారం తగ్గించుకోకపోతే రాజకీయ పతనం తప్పదు” అంటూ రాచమల్లును ఉద్దేశించి వరదరాజులరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

“నాలుక ఎప్పుడు కోస్తావో చెప్పు..  చూసుకుందాం”

 

రాచమల్లు చేసిన సవాళ్లు, వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సవాల్‌ విసిరారు. “నాలుక ఎప్పుడు కోస్తావో చెప్పు..  చూసుకుందాం” అంటూ రాచమల్లును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్య పరిధిలో ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం మాత్రం సరికాదని ఎమ్మెల్యే సూచించారు.

 

“వ్యాపారులపై ప్రేమ కాదు.. రాజకీయ స్వార్థమే”

 

ప్రొద్దుటూరు వ్యాపారుల విషయంలో రాచమల్లు వ్యవహరిస్తున్న తీరుపైనా వరదరాజులరెడ్డి విమర్శలు గుప్పించారు.“ప్రొద్దుటూరు వ్యాపారులపై రాచమల్లుకు ఉన్నది ప్రేమ కాదు.. కేవలం స్వార్థం మాత్రమే” అని ఆరోపించారు. వ్యాపారం కోసం అప్పులు చేయడం సహజమేనని, అయితే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టే చరిత్ర తమది కాదని అన్నారు.ప్రొద్దుటూరులోకి భారీగా డబ్బులు వసూలు చేసే కార్పొరేట్‌ సంస్థలను గతంలో తీసుకువచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. స్థానిక వ్యాపారుల ప్రయోజనాలపై నిజంగా ప్రేమ ఉంటే వారి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉండేదన్నారు.ఇతరుల నుంచి వచ్చిన సొమ్ముతో దానధర్మాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై రాచమల్లు వర్గం వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

 

“రాచమల్లు.. మాటలతో కాదు, ప్రజల మధ్య తేల్చుకుందాం”

 

రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా తాము ప్రజల మధ్యే ఉండి సమాధానం ఇస్తామని వరదరాజులరెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.“రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. బీసీలను కించపరిస్తే బీసీలు సమాధానం చెబుతారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు” అని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తేల్చిచెప్పారు.ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో ప్రొద్దుటూరు రాజకీయాల్లో రాచమల్లు–వరద మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది. ముఖ్యంగా చల్లా రాజగోపాల్‌ యాదవ్‌ అంశం చుట్టూ ఇరువర్గాల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!