–హాస్టల్ విద్యార్థినులకు మహిళలు, చిన్నారులపై నేరాలు..
–సైబర్ మోసాలపై ఎస్ఐ మహబూబ్ బాషా అవగాహన
సలాం ప్రొద్దుటూరు:
మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతతో పాటు సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ ఆధ్వర్యంలో టూ టౌన్ ఎస్ఐ మహబూబ్ బాషా సంజీవనగర్లోని బాలికల హాస్టల్ను సందర్శించి విద్యార్థినులకు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.
సైబర్ మోసాలపై జాగ్రత్త అవసరం
ఈ సందర్భంగా ఎస్ఐ మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల విధానాలు కూడా మారుతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజ్లు, సోషల్ మీడియా, నకిలీ లింకులు తదితర మార్గాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు.విద్యార్థినులు ఓటీపీ, పాస్వర్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం/కార్డు సమాచారం, వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం, తెలియని యాప్లను డౌన్లోడ్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
వేధింపులను దాచుకోవద్దు
మహిళలు, బాలికలు తమకు ఎదురయ్యే వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద పరిస్థితులను భయంతో దాచుకోకూడదని ఎస్ఐ సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్/సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.చిన్నారులపై జరిగే నేరాల విషయంలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బాలికలకు భద్రతపై సరైన అవగాహన కల్పించడం ద్వారా అనేక ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చని పేర్కొన్నారు.
అప్రమత్తతతోనే సురక్షిత సమాజం
విద్యార్థినులు భయపడకుండా సమస్యలను వెల్లడించే వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ కల్పించాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగత భద్రత, ఆన్లైన్ భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, అనుమానం వచ్చిన ప్రతి సందర్భంలో సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణకు పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి నేరాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు భద్రత, సైబర్ నేరాల నివారణ, అప్రమత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

