–క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు, లోకేష్..
–ప్రజలు వాస్తవాలు గుర్తించాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో 80 శాతం పనులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులను మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామేశ్వరంలోని మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పాలనా అనుమతులు, భూసేకరణ, రైతులకు పరిహారం, పునరావాసం వంటి కీలక ప్రక్రియలన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. విమానాశ్రయం నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగిందని, అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టుకు తామే కారణమన్నట్లు ప్రచారం చేసుకోవడం క్రెడిట్ చోరీ యత్నమేనని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు గతంలో సుమారు 5,800 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించగా, వైఎస్ జగన్ ప్రభుత్వం దాదాపు 2,800 ఎకరాల్లోనే ప్రాజెక్టును అమలు చేసేలా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు కడప స్టీల్ ప్లాంట్, గ్రీన్కో ప్రాజెక్టు, గూగుల్ డేటా సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులు కూడా జగన్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న క్రెడిట్ రాజకీయాలను ప్రజలు గమనించి వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కూడా రాచమల్లు విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై స్పందించి వారి తరఫున నిలబడాల్సిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని సమర్థించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, రాజకీయ ప్రచారాల కోసం అసత్యాలను ప్రచారం చేయవద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సూచించారు.
