–ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్న విధానంపై ఆరా
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్లో నిర్వహిస్తున్న స్మార్ట్ కిచెన్ను కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఎస్.వి. ప్రవీణ్ కుమార్తో పాటు విదేశీ ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశీలించింది. ఐక్యరాజ్యసమితి అంతర్గత పర్యవేక్షణ సేవల కార్యాలయం (OIOS) నుంచి వచ్చిన కరోలిన్ కురియా, జోసెఫిన్ స్మార్ట్ కిచెన్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.ప్రొద్దుటూరు మండల పరిధిలో మొత్తం 69 పాఠశాలలు ఉండగా, వాటిలో 53 పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వంట విధానం, ఆహార పదార్థాల వినియోగం, పాఠశాలలకు సరఫరా చేస్తున్న తీరుపై విదేశీ బృందం సిబ్బందిని అడిగి తెలుసుకుంది.విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయలను స్మార్ట్ కిచెన్ ద్వారా వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం వివిధ రకాల కూరలు, భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ విధానం ద్వారా పాఠశాల విద్యార్థులకు సమతుల్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బృందానికి వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండలం ఎంఈఓ-2 శోభారాణి, మండల వెలుగు ఏపీఎం రమణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్యామ్, మాధవి తదితరులు పాల్గొన్నారు.

