–వేంపల్లిలో పారిశుధ్య కార్మికుల ధర్నా.. చెత్తకుప్పలుగా మారిన వీధులు
–అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారు: ఆప్ నేత రహమతుల్లా
సలాం ప్రొద్దుటూరు – వేంపల్లి:
వేంపల్లి గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సంబంధించిన 30 నెలల పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ పారిశుధ్య కార్మికులు గత మూడు రోజులుగా ఆందోళన చేపట్టడంతో పట్టణంలో పారిశుధ్య నిర్వహణ స్తంభించింది.
కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో వీధుల్లో చెత్త తొలగింపు, పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ప్రధాన వీధులతో పాటు కాలనీల్లోనూ పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యపై స్థానిక ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్, పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి రహమతుల్లాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన ఆప్ జిల్లా కో-కన్వీనర్ దాదా పీర్తో కలిసి వేంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ కోసం కట్ చేసిన నగదు వారి ఖాతాల్లో జమ కాలేదనే ఆరోపణలు రావడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్నారు. 30 నెలలుగా పీఎఫ్ బకాయిలు ఎందుకు చెల్లించలేదు? ఆ నగదు ఎక్కడికి వెళ్లింది? అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మికుల ఆందోళన ఒకవైపు, అధికారుల నిర్లక్ష్యం మరోవైపు ఉండటంతో మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయన అన్నారు. ప్రజా సేవే ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకునే పాలకులు, పారిశుధ్య కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
పారిశుధ్య కార్మికుల నుంచి పీఎఫ్ కోసం మినహాయించిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాలని, బకాయి ఉన్న పీఎఫ్ మొత్తాన్ని వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని రహమతుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు మరింత దిగజారకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు.
