–సిబ్బంది పనితీరుపై ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పురపాలక సంఘంలోని పురసేవ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేంద్రానికి చేరుకున్న ఆయన సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న పౌర సేవలు, దరఖాస్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, విధుల నిర్వహణలో అలసత్వం వంటి అంశాలపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని స్పష్టం చేశారు.ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతూ విధి నిర్వహణకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. కార్యాలయ క్రమశిక్షణను ఉల్లంఘించడం, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు.“ప్రభుత్వం జీతం చెల్లిస్తున్న ఉద్యోగి ప్రభుత్వ సేవకుడిగా బాధ్యతతో విధులు నిర్వర్తించాలి. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం లేదా విధి నిర్వహణకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సిబ్బంది తీరు మారకపోతే సంబంధిత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం” అని కమిషనర్ స్పష్టం చేశారు.ప్రజలకు అందాల్సిన పౌర సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారి, సిబ్బందిని బాధ్యులుగా గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై పురసేవ కేంద్రం పనితీరు, పెండింగ్ దరఖాస్తులు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.తనిఖీలో భాగంగా పురసేవ కేంద్రంలోని పరిశుభ్రత, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది పని విధానాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన పౌర సేవలు అందించడమే ప్రొద్దుటూరు పురపాలక సంఘం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
