–రాచమల్లు వ్యాఖ్యలపై మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి ఘాటు స్పందన
సలాం ప్రొద్దుటూరు:
రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్యార్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తానని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, తాను ఎప్పుడూ ఎవరినీ అగౌరవపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. బీసీ ఓట్ల రాజకీయంతో తనపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు.పార్టీ ఆదేశిస్తే మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసే అవకాశం ఉందని, అయితే పార్టీలోని ఔత్సాహికులకు అవకాశం కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైసీపీ చేనేత విభాగం నాయకుడు బండారు సూర్యనారాయణ కుటుంబం పట్ల తనకు గౌరవం ఉందని, తనపై వచ్చిన ఆరోపణలను నమ్మి ఆయన విమర్శలు చేయడం బాధాకరమన్నారు.గతంలో గ్రామాల్లో జరిగిన ఘర్షణలు, హత్యలకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని రాఘవ రెడ్డి స్పష్టం చేశారు. పాత ఘటనలను రాజకీయ విమర్శలకు ఉపయోగించకుండా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.చెన్నమరాజుపల్లె టీడీపీ నాయకుడు రాజువారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ గతంలో రాజువారి, నశ్యం కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇరు కుటుంబాలు సామరస్యంగా ఉంటూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాయని తెలిపారు. ఇరు వర్గాల్లోనూ బీసీలే ప్రాణాలు కోల్పోయారని, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరారు.సమావేశంలో మార్కెట్యార్డు ఇన్చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్కుమార్, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
