–నలుగురు బీటర్ల అరెస్ట్..
–రూ.9 వేల నగదు, 4 మట్కా స్లిప్పులు స్వాధీనం
సలాం ప్రొద్దుటూరు:
మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక నిఘాలో భాగంగా ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో మట్కా నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో మట్కా రాస్తున్నారన్న సమాచారంతో వన్టౌన్ ఎస్ఐ జి. మధుసూదన్ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో పెన్నానగర్కు చెందిన నలుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు.అరెస్టయిన వారిలో షేక్ ఖాదిర్ (31), దేవరగుంట్ల దస్తగిరి (39), దూదేకుల దస్తగిరి (25), కాకర్ల దస్తగిరి (33) ఉన్నారు. వీరి వద్ద నుంచి 4 మట్కా స్లిప్పులతో పాటు రూ.9,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. మట్కా, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.మట్కా, జూదం కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా నష్టపరిచే అసాంఘిక కార్యకలాపాలని, ప్రజలు వీటికి దూరంగా ఉండాలని వన్టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సూచించారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
