–ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందించడమే లక్ష్యం– కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
–14,094 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.6.21 కోట్ల పింఛన్ల పంపిణీ
సలాం ప్రొద్దుటూరు:
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. మంగళవారం స్థానిక 6వ వార్డు సచివాలయం పరిధిలోని డ్రైవర్ కొట్టాల ప్రాంతంలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి పింఛన్ల పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పూర్తి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పింఛన్ నగదు అందించాలని, లబ్ధిదారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.పట్టణంలో దివ్యాంగులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, తలసీమియా బాధితులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, కిడ్నీ, లివర్ వ్యాధిగ్రస్తులు తదితరులకు కలిపి 20 రకాల సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 14,094 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.6 కోట్ల 21 లక్షల నగదును పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.ప్రజలకు మెరుగైన, సంతృప్తికరమైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిరంతరం కృషి చేస్తోందని కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.కార్యక్రమంలో భాగంగా కమిషనర్ దివ్యాంగులైన మహబూబ్, సుబ్బారాయుడులకు పింఛన్ నగదును అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.


