
–అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రతినిధులు రాజీనామా చేస్తారా?
–‘బీసీ గళం’ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సవాల్
సలాం ప్రొద్దుటూరు – తాడేపల్లి:
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి ప్రభుత్వం డ్రామా బిల్లుతో బీసీలను మభ్యపెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు.సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘బీసీ గళం’ కార్యక్రమంలో బీసీల సమస్యలు, వారిపై జరుగుతున్న దాడులు, వివిధ అంశాల్లో బీసీలకు జరిగిన అన్యాయాలపై పార్టీ ప్రతినిధులతో చర్చించినట్లు రమేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 90 మందికి పైగా పార్టీ ప్రతినిధులు హాజరైనట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీలను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు డ్రామా బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. బీసీలకు వాస్తవంగా న్యాయం చేయాలంటే 34 శాతం రిజర్వేషన్లను స్పష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రమేష్ యాదవ్ మండిపడ్డారు. బీసీల సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.బీసీల హక్కులు, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసి సామాజిక న్యాయాన్ని కాపాడాలని కోరారు.

