సలాం ప్రొద్దుటూరు:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీ సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ కార్యదర్శి బి. విజయకుమార్ పిలుపునిచ్చారు. శనివారం ప్రొద్దుటూరు ఎన్జీవో హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజా సమస్యలపై నిర్వహిస్తున్న ‘సామాజిక శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ దృష్టికి అనేక సమస్యలను తీసుకువచ్చారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు సక్రమంగా అందడం లేదని వారు ఆరోపించారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో మున్సిపాలిటీల్లో రెండు సెంట్లు, పంచాయతీల్లో మూడు సెంట్ల స్థలం, రూ.5 లక్షల హౌసింగ్ లోన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 24న కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొని, తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులకు అందజేయాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి కె. సాల్మన్, మున్సిపల్ యూనియన్ నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు.
