–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం
సలాం ప్రొద్దుటూరు– కడప:
గత 12 ఏళ్ల సుదీర్ఘ పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడప ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు చేర్చారని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ నాటి కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కలిపి మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఆర్థిక దివాలా తీయించారని విమర్శించారు. యుపిఏ ప్రభుత్వ హయాంలో భారత అప్పులు 48 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 218 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. సదరు అప్పుల ద్వారా తీసుకువచ్చిన ధనాన్ని ఏమి చేశారో కూడా నరేంద్ర మోడీ చెప్పడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా జిఎస్టి ద్వారా దేశంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఒక డాలర్ కు బదులుగా రూపాయి పతన మై 95 రూపాయలకు క్షీణించిందన్నారు. సుమారు 100 కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన 16.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. సదరు ఆర్థిక భారం ప్రజలు మోయాల్సి వస్తోందని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోం దన్నారు. ఉపాధి కల్పన లేకపోగా దేశ సంపదను అ దాని, అంబానీలకు మోడీ దోచిపెడుతున్నాడని విమర్శించారు. దేశ సంపదను దోపిడీ చేయడం ఒకవైపు కొనసాగిస్తూ, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ఖరీదైన విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. మోడీ ప్రయాణం చేసే విమానం ఖరీదు 8,500 కోట్ల రూపాయలు కాగా, తన ఇమేజ్ పెంచుకునేందుకు సుమారు 5,987 కోట్ల రూపాయలను పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేశాడ న్నారు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజా సంక్షే మా నీ పూర్తిగా అటకెక్కించినట్లు ఆరోపించారు. 12 ఏళ్ల ఆర్థిక విధ్వంసం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు హిందూ ముస్లిం మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసిపి పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయని, ఆ పార్టీలు కూడా దేశ ఆర్థిక విధ్వం సానికి ప్రధాన కారకులయ్యారన్నారు. నిరుద్యోగం తాండవిస్తుండటం, పేపర్ లీకుల కారణంగా విద్యార్థులు, యువత ప్రధాని నరేంద్ర మోడీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు స్వయంగా రోడ్లపైకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. మోడీ చేస్తున్న ఆర్థిక విధ్వంసంతో సదరు దుష్ఫలితాల కారణంగా వ్యాపారులు పూర్తిగా దివాలా తీసారని ఆవేదన వ్యక్తం చేశారు . అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మయాన రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక విధ్వంసంతో కడపలో వ్యాపారులు దివాలా తీసే స్థాయికి చేరుకున్నారన్నారు. పూర్తిగా వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ, రాష్ట్ర పన్నులు ఒకవైపు వేధిస్తుండగా, మరోవైపు ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోయి వ్యాపారాలు లేక దివాలా తీస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నయన్నారు. ఆర్థికంగా ప్రజలు చితికి పోతున్నారని ఆరోపించారు. ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ నేత హమీద్ మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా వ్యాపారాలు పూర్తిగ దెబ్బతిన్నాయన్నారు. వ్యాపారులకు రుణాలు కూడా అందడం లేదన్నారు. బిజెపి ప్రభుత్వం వ్యాపారులను పూర్తిగా దెబ్బతీసినట్లు ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ భాష, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రతినిధులు దినకర్,రహమతుల్లా, షామీర్ జాబిర్వలి, రఫీ ఖాన్ ముజాహిద్, కేకేసి అధ్యక్షుడు శీను డిసిసి కోశాధికారి హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరాజుద్దీన్, ఎన్ఎస్ఇ అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు
