
–వేలాదిమంది భక్తుల సందడి..
–ప్రత్యేక ఫాతేహాలు.. భక్తిరసంలో మునిగిన బనగానపల్లి
సలాం ప్రొద్దుటూరు – బనగానపల్లి ప్రతినిధి:
నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని కొండపేటలో దస్తగిరి స్వామి ముని ముని మనవడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ దర్గా హజ్రత్ సయ్యద్ షా నబి షా ఖాద్రి (రహ్మతుల్లాహి అలైహి) ఉరఫ్ భం భం పీర్ స్వామివారి వార్షిక ఉరుసు మహోత్సవం గురువారం రాత్రి అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ఫాతేహాలు సమర్పించి దీవెనలు పొందారు.
ఉరుసు మహోత్సవంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పాల్గొని దర్గా వద్ద ప్రత్యేక ఫాతేహాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బురానుద్దీన్, అత్తార్ కలాం, లాయర్ రఫీ, ఖాసీం బాబు, అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉరుసు మహోత్సవానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ఫాతేహాలు సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి సయ్యద్ గౌస్ భాషా ఖాద్రి ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖైర్, తాహిర్, అనిల్, రహిమాన్ చూరి బుడ్డి తదితరులు పాల్గొన్నారు.
భక్తులను అలరించిన ఖవాలీ
ఉరుసు మహోత్సవంలో నిర్వహించిన ఖవాలీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సూఫీ సంప్రదాయ ఆధ్యాత్మిక తో దర్గా ప్రాంగణాన్ని భక్తిరసంతో నింపాయి. ఖవ్వాలీల ఆధ్యాత్మిక గానాలకు భక్తులు తన్మయత్వంతో స్పందించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
కులమతాలకు అతీతంగా భక్తుల రాక
ఉరుసు మహోత్సవం సందర్భంగా కుల, మత భేదాలకు అతీతంగా వేలాదిమంది భక్తులు దర్గా చేరుకుని పూల చాదర్లు, అత్తర్లు, అగర్బత్తీలు సమర్పించి ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయగా, దర్గా పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. విద్యుద్దీపాల అలంకరణలు, భక్తుల సందడి, ప్రార్థనలు, ఖవాలీ కార్యక్రమాలతో బనగానపల్లి కొండపేట పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక వేడుకలకు వేదికగా మారింది.

