సలాం ప్రొద్దుటూరు (రైల్వేకోడూరు):
బొప్పాయి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.18 గిట్టుబాటు ధరను తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. చిట్వేలు మండలంలోని నేతివారిపల్లి, వెంకట్రాచుపల్లి, సిద్ధారెడ్డిపల్లి గ్రామాల్లో బొప్పాయి రైతులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను చర్చించారు.
సువాసి శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు చంద్రశేఖర్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పందికాళ్ళ మణి పాల్గొన్నారు. కలెక్టర్ సమక్షంలో బొప్పాయికి రూ.18 ధర నిర్ణయించినప్పటికీ, కొందరు దళారులు వ్యాపారులతో కుమ్మక్కై రూ.17కే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాయకులు ఆరోపించారు.
ధర తగ్గింపును నిరసిస్తూ రైతులు సమ్మెకు దిగారని, అయితే సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కొందరు అక్రమంగా వాహనాలను ఏర్పాటు చేసి బొప్పాయి కొనుగోలు చేస్తున్నారని వారు విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎమ్మార్వో, మార్కెటింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు.
రైతుల శాంతియుత సమ్మెను పోలీసులు, అధికారుల సహకారంతో అడ్డుకోవడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. బొప్పాయి సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగినందున రూ.18 ధర సరిపోదని, కనీసం రూ.20కు పెంచి చెల్లించాలని కోరారు. అంతేకాకుండా మామిడి రైతులకు అందిస్తున్న విధంగా బొప్పాయి రైతులకు కూడా కిలోకు రూ.5 సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గిట్టుబాటు ధర కోసం రైతులు చేపట్టిన ఉద్యమానికి రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమవారం రైల్వేకోడూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు నియోజకవర్గంలోని బొప్పాయి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.సమావేశం అనంతరం మూడు గ్రామాల్లో రైతు సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
