–ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని AISA, AIFDS, USFI డిమాండ్
సలాం ప్రొద్దుటూరు ( అనంతపురం):
నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్ పిలుపు అనంతపురం నగరంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా AISA, AIFDS, USFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు, AISA జిల్లా కన్వీనర్, USFI జిల్లా ప్రధాన కార్యదర్శి భీమేష్ మాట్లాడుతూ, దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్ష అయిన నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడం విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఉంచిన విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, కొందరు అక్రమ మార్గాల ద్వారా ప్రశ్నపత్రాలను లీక్ చేసి వారి భవిష్యత్తుతో చెలగాటమాడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, గోప్యత, భద్రత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం, సంబంధిత సంస్థలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఉన్న పూర్తి కుట్రను వెలికితీసి, ఇందులో ప్రమేయం ఉన్న అధికారులు, మధ్యవర్తులు, మాఫియా ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పటిష్ఠమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా సంస్కరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వాల ప్రథమ బాధ్యత అని పేర్కొన్న నాయకులు, రాష్ట్రవ్యాప్త బంద్కు సహకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
