సలాం ప్రొద్దుటూరు:
స్టాంప్ రైటర్లను తొలగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట స్టాంప్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పెన్డౌన్ నిరసన కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా స్టాంప్ రైటర్ల సమస్యలను తెలుసుకున్న ఇర్ఫాన్ బాషా, కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న స్వతంత్ర స్టాంప్ రైటర్ల స్థానంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.స్టాంప్ రైటర్లు కేవలం పత్రాలు రాసే వ్యక్తులు మాత్రమే కాదని, దశాబ్దాల అనుభవంతో చట్టబద్ధంగా, భవిష్యత్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా డాక్యుమెంట్లను రూపొందించే నిపుణులని పేర్కొన్నారు. జీవితకాల పొదుపుతో కొనుగోలు చేసే స్థలాలు, ఇళ్లకు సంబంధించిన పత్రాల్లో చిన్న తప్పిదం జరిగినా భవిష్యత్లో తీవ్ర న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం తయారయ్యే రిజిస్ట్రేషన్ పత్రాలు తరతరాలకు ఆధారాలుగా నిలుస్తాయని, అలాంటి బాధ్యతను అనుభవం లేని వ్యక్తులకు అప్పగించడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. అలాగే స్టాంప్ రైటర్స్ సంఘం నాయకులను చర్చలకు పిలిచి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖండించారు.
ప్రభుత్వ నిర్ణయం అమలైతే సాధారణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, డాక్యుమెంట్లలో లోపాలు తలెత్తితే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. అధికారుల ఆధీనంలో ఉండే కొత్త వ్యవస్థ రాజకీయ వివక్షకు కూడా దారితీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.స్టాంప్ రైటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే వారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని ఇర్ఫాన్ బాషా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గోసంగి సుబ్బారెడ్డి, మైనారిటీ నాయకులు మౌలాలి, షేక్ గౌస్, స్టాంప్ రైటర్స్ అసోసియేషన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో స్టాంప్ రైటర్లు పాల్గొన్నారు.
