–అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం…
సలాం ప్రొద్దుటూరు:
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అని అవి ఏమాత్రం ఫలించవని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనకు పట్టం కట్టారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖలో అభివృద్ధి పనులు వేగవంతం చేసి, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షిస్తూ ముందుకు సాగుతోందన్నారు. కడప జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కడపను ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
చట్టం తన పని చేసుకుంటుంది
తన కుటుంబ సభ్యుల విషయంలోనూ ఎలాంటి ప్రత్యేక వైఖరి ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన కుమారుడు అయినా, మరెవరైనా తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. తప్పు చేసిన వారిని తను ఎప్పుడూ సమర్థించనన్నారు. వ్యక్తుల కంటే చట్టమే గొప్పది అని హితవు పలికారు.
వైఎస్సార్సీపీ నాయకులు వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. గత పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకున్నారని, అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమికి స్పష్టమైన మద్దతు ఇచ్చారని అన్నారు.
ప్రజల విశ్వాసమే తమకు బలమని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు.
