సలాం ప్రొద్దుటూరు:
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు భారత రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన ప్రధాన మంత్రుల్లో ఒకరని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరులోని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడిగా, దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిగా దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేలా చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, విదేశాంగ విధానంలోనూ కీలక మార్పులు తీసుకువచ్చి భారతదేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచారని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా మరణానంతరం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.అనంతరం పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్రావు, సుధాకర్, సంజీవరెడ్డి, గురివిరెడ్డి,కె పి ఓబుల రెడ్డి అధ్యాపకులు రమణ, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
