సలాం ప్రొద్దుటూరు:
స్థానిక రామేశ్వరం ప్రాంతంలోని శ్రీ కాశీ హనుమత్ లింగేశ్వరస్వామి (మూలస్వామి) దేవాలయంలో సోమవారం “శివోహం అన్నప్రసాద సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం” భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన జూటూరు మదుసూధన రావు, లక్ష్మీ కుమారి దంపతులు తమ కుమారులు సాయి కౌశిక్, రిషి ఆర్యల సహకారంతో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా నిలిచారు. భక్తులకు స్వచ్ఛమైన, శుచిగా తయారుచేసిన అన్నప్రసాదాన్ని వందలాది మంది భక్తులకు పంపిణీ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివోహం అన్నప్రసాద సేవా సంఘం అధ్యక్షుడు శెట్టిపల్లె రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా భక్తులకు నిరాటంకంగా అన్నప్రసాద సేవలు కొనసాగిస్తామని తెలిపారు. దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ ద్వారా భక్తి భావనతో పాటు సేవా భావన కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు మురుకూటి సూర్యనారాయణ రెడ్డి, విష్ణు నారాయణతో పాటు పలువురు స్థానిక భక్తులు, దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు.
