సలాం ప్రొద్దుటూరు :
స్థానిక ఆర్టీసీ పాత బస్టాండ్ పక్కన ఉన్న మసీదుకు వెళ్లే మార్గంలో ఆటోలు అడ్డంగా నిలపడంతో ప్రార్థనలకు వచ్చే భక్తులు, తోపుడు బండ్లపై జీవనం సాగించే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ మంగళవారం సమస్య స్థలాన్ని సందర్శించారు.
స్థానికులు వివరించిన సమస్యలను స్వయంగా పరిశీలించిన ఆయన ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులతో అక్కడికక్కడే సమావేశమై పరిష్కార మార్గాలపై చర్చించారు. మసీదుకు వచ్చే ప్రార్థనకారులు, చిరు వ్యాపారులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న డా. ముక్తియార్, అందరికీ అనుకూలంగా ఉండే విధంగా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
