సలాం ప్రొద్దుటూరు (రాజస్థాన్):
రాజస్థాన్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక మంత్రి పనితీరును విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. అది మంత్రి ప్రతిష్టను, విద్యాశాఖ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందంటూ అక్కడి జిల్లా విద్యాశాఖాధికారి (DEO) సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. దీనిని సవాలు చేస్తూ ఆ ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించారు.రాజస్థాన్ హైకోర్టు షాక్ తీర్పు ఇచ్చింది .ఈ కేసును విచారించిన జస్టిస్ ఫర్జంద్ అలీ ధర్మాసనం, ఉపాధ్యాయుడి సస్పెన్షన్ ఆర్డర్ను పూర్తిగా రద్దు (Quashed) చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.మంత్రుల కోపం చట్టం కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలు తీసుకోవడానికి కేవలం ఉన్నతాధికారుల అసంతృప్తి లేదా మంత్రిగారికి కోపం రావడం ప్రాతిపదిక కాకూడదనీ తెలిపింది.ప్రతి పరిపాలనా చర్యకూ కచ్చితమైన చట్టబద్ధత (Statutory Provision) ఉండాలనీ చెప్పింది.
అధికారులు రాజులు కారు
జిల్లా విద్యాశాఖాధికారి ఒక చట్టబద్ధమైన అధికారి మాత్రమే కానీ, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం లేదా పాతకాలపు రాచరికపు పద్ధతుల్లో పాలించడానికి ఆయనేమీ ఒక సామ్రాజ్యానికి రాజు కాదు.
ఫ్రీ స్పీచ్ (వాక్ స్వాతంత్ర్యం)
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించాలి. కేవలం సోషల్ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకున్నంత మాత్రాన చట్టపరమైన నిబంధనలను పక్కనపెట్టి ఉద్యోగిని శిక్షించడం సరైంది కాదు.
శాఖాపరమైన విచారణ వేరు, సస్పెన్షన్ వేరు
ఒకవేళ సదరు ఉద్యోగి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే, చట్ట ప్రకారం శాఖాపరమైన విచారణ (Departmental Inquiry) జరపవచ్చు కానీ, ఇలా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం కుదరదని కోర్టు స్పష్టం చేస్తూ ఆ ఉపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.
