–ఏఐ కెమెరాలు, 360 సీసీ కెమెరా నెట్వర్క్ సాయంతో నిందితుడి ఆచూకీ గుర్తించిన ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు
సలాం ప్రొద్దుటూరు:
మైనర్ బాలిక అదృశ్యమైన కేసును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించిన ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు. 360 సీసీ కెమెరా నెట్వర్క్, ఏఐ కెమెరాల డేటా విశ్లేషణతో నిందితుడి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు మండలం అమృతానగర్కు చెందిన 14 ఏళ్ల బాలిక ఈ నెల 1న కనిపించకుండా పోవడంతో, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. నాగభూషణ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు 360 సీసీ కెమెరా నెట్వర్క్, ఏఐ కెమెరాల డేటాతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జూలై 10న తిరుపతిలోని విష్ణునివాసం సత్రంలో బాలికను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
దర్యాప్తు అధికారి సీఐ ఎం. నాగభూషణ్ పర్యవేక్షణలో, ఎస్ఐ కె.సి. రాజు నేతృత్వంలోని ప్రత్యేక బృందం విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 14న ఉదయం మడూరు రోడ్డులో తనిఖీలు నిర్వహించి, పచ్చిపాలు కార్తీక్ ఆచారి (23)ను అరెస్ట్ చేసింది. నిందితుడు ఉపయోగించిన AP04 BT 1172 నంబర్ గల హోండా సీబీ యూనికార్న్ మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
యువతకు పోలీసుల హెచ్చరిక
మైనర్లతో ప్రేమ, వివాహం పేరుతో సంబంధాలు ఏర్పరచుకోవడం, వారిని ఇంటి నుంచి తీసుకెళ్లడం లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం పోక్సో చట్టం ప్రకారం తీవ్రమైన నేరం అని సీఐ ఎం. నాగభూషణ్ హెచ్చరించారు. చట్టాన్ని గౌరవిస్తూ మైనర్ల హక్కులను పరిరక్షించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని యువతకు సూచనలు ఇచ్చారు.
