సలాం ప్రొద్దుటూరు :
ఏపీ పాలిసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం తొలి దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పాలెం గురుమూర్తి రెడ్డి తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సర్టిఫికెట్లు ధ్రువీకరించబడని లేదా సవరణలు అవసరమైన అభ్యర్థులు నోటిఫైడ్ హెల్ప్లైన్ కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి జూలై 1వ తేదీ వరకు హాజరై సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ హెల్ప్లైన్ కేంద్రాన్ని సంప్రదిస్తే వెంటనే తగిన సహాయ సహకారాలు, అవసరమైన అవగాహన కల్పించబడుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన సమయానికి అనుగుణంగా ఉదయం 9 గంటలకు లేదా మధ్యాహ్నం 1 గంటకు హెల్ప్లైన్ కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 29 నుంచి జూలై 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, జూలై 4న వెబ్ ఆప్షన్ల మార్పులకు అవకాశం ఉంటుందని తెలిపారు. జూలై 6న సీట్ల కేటాయింపు జరగనుండగా, సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 7 నుంచి 10వ తేదీ మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 7 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.కౌన్సెలింగ్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ విధానం, యూజర్ మాన్యువల్తో పాటు ఇతర పూర్తి వివరాలు polycet.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
