సలాం ప్రొద్దుటూరు :
హౌసింగ్ పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిగితే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు .టీడీపీ పార్టీ యువ నేత కొండారెడ్డి శుక్రవారం ఆయన స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.హౌసింగ్ పథకం కోసం కేటాయించిన 271 టన్నుల ఇనుములో దాదాపు 268 టన్నులు కనిపించకుండా పోయాయని, ఈ అంశంపై ఇప్పటికే అధికారిక విచారణ ప్రారంభమైందన్నారు. అసలు ఇనుము కొనుగోలు చేశారా లేదా కొనకుండానే బిల్లులు చెల్లించారా అనే అంశాలు విచారణలో తేలనున్నాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలు వెలుగులోకి రావడానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసిన ప్రయత్నాలే కారణమని చెప్పారు. గోడౌన్ను తెరిచి తనిఖీ చేయాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందించలేదని, చివరకు గోడౌన్ తెరిచినప్పుడు ఇనుము లేదనే విషయం బయటపడిందన్నారు.
మున్సిపల్ పాఠశాల గోడను పగులగొట్టి ఇనుము దొంగిలించారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ, తాను చేపట్టిన నిర్మాణ పనులు మార్చి 2024 నాటికే పూర్తయ్యాయని, ఎన్నికల సమయంలో నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. జగనన్న కాలనీల భూముల కొనుగోలు వ్యవహారంలోనే అసలు భారీ కుంభకోణం జరిగిందని కొండారెడ్డి ఆరోపించారు. సుమారు 480 ఎకరాల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వా నికి అధిక ధరలకు విక్రయించారని, రూ.162 కోట్ల లావాదేవీల్లో దాదాపు రూ.80 కోట్ల మేర అక్రమాలు జరిగాయని విమర్శించారు. వేలాది ఇళ్ల నిర్మాణం పేరుతో ఇనుము, సిమెంట్, ఇసుక, తలుపులు, కిటికీలు, విద్యుత్ సామగ్రి వంటి వస్తువులు సరఫరా అయ్యాయని, అవన్నీ ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి తలారి పుల్లయ్య, వాల్మీకి కార్పోరేషన్ డైరెక్టర్ నాగరాజు, సీనియర్ నాయకులు ఈ.వి. సుధాకర్ రెడ్డి, రసూల్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
